TSPSC Group 1 Applications: భారీగా తగ్గిన గ్రూప్-1 దరఖాస్తులు.. ఇప్పటివరకు 2.7లక్షలు

0
12

గ్రూప్-1 పోస్టులకు గత నోటిఫికేషన్‌తో పోలిస్తే ఈసారి దరఖాస్తులు భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌కు సుమారు 3.8లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, ఈసారి ఇప్పటివరకు 2.7లక్షల అప్లికేషన్స్ మాత్రమే వచ్చాయి. ఇవాళ్టితో అప్లికేషన్ గడువు ముగియనుండగా, మరికొన్ని దరఖాస్తులు వచ్చే ఛాన్సుంది. అప్లికేషన్ ప్రాసెస్ ఫీజును రూ. 200గా నిర్ణయించారు. ఎగ్జామినేషన్ ఫీజు రూ. 120గా నిర్ణయించారు. అయితే నిరుద్యోగులకు ఈ ఫీజు(ఎగ్జామినేషన్ ఫీజు) నుంచి మినహాయించారు.

ఇటీవల పలు ఉద్యోగ నియామకాలు పూర్తికావడంతో దరఖాస్తుల సంఖ్య తగ్గినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 గ్రూప్‌-1 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఫిబ్రవరి19న తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తోంది.

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9న, మెయిన్స్ అక్టోబర్ 21నుంచి నిర్వహించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. 33 జిల్లా కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్వహించనున్నారు.