Capable To Handle Water Shortage In Summer: సమ్మర్‌లో నీళ్ల ఫిర్యాదులు రావొద్దు.. శ్రీధర్ బాబు వార్నింగ్

0
18

మిషన్ భగీరథ పైప్‌ప్లైన్లు ఎక్కడ లీకేజీ లేకుండా ప్రజలకు ఇబ్బందుకు కలుగకుండా అప్రమత్తంగా ఉండి త్రాగునీటి సమస్య తీర్చాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులను మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. వేసవిలో ప్రజలకు త్రాగునీటి సమస్యలు తతెత్తకూడదని, ఒక వేళ సమస్య పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై చర్యలకు తీసుకుంటామని శ్రీధర్‌బాబు హెచ్చరించారు. మల్హర్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని బుధవారం రాత్రి మండల పరిషత్ భవనంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

తాడిచర్ల గ్రామంలోని ఆర్ అండ్ ఆర్ కాలనీలో రూ.16 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రానికి, రూ.4 కోట్లతో నిర్మించన విద్యుద్దీకరణ పనులను ప్రారంభిస్తూ తాడిచర్ల నుంచి గోపాలపూర్ వరకు రూ.40 లక్షలతో చేపట్టిన రహదారి నిర్మాణ పనులకు, రూ.23 లక్షలతో నిర్మించనున్న అంతర్గత రహదారి నిర్మాణ పనులకు, మల్లారంలో రూ.20 లక్షలతో నిర్మాణం చేపట్టే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేశారు. గ్రామ ప్రత్యేక అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలకు ఏం అవసరం ఉందో ఆ అవసరాలకు తగ్గట్లుగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిందేనని ఆయన ఆదేశించారు.

మారుమూల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రాగానే రూ.5 లక్షల ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.10 లక్షలకు పెంచి కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్నట్లు శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎంపీపీ చింతలపల్లి మలహల్రావు, ఎంపీడీవో కే.శ్యాంసుందర్, తహసీల్దార్ కే.రవికుమార్ తోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.