RS Praveen Kumar: బీఎస్పీకి రెండు సీట్లు కేటాయించిన కేసీఆర్..ఆర్ఎస్పీ ఏమన్నారంటే?

0
17

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొత్తు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా సీట్ల పంపకాలపై క్లారిటీ వచ్చింది. బీఎస్పీకి రెండు సీట్లను కేటాయించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నాగర్ కర్నూల్, హైదరాబాద్ స్థానాలను బీఎస్పీకి కేటాయించారు. మొత్తం 17 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ 15 స్థానాల్లో పోటీ చేస్తుండగా..బీఎస్పీ రెండు స్థానాల్లో బరిలోకి దిగుతుంది . బీఆర్ఎస్ ఇప్పటికే 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది.

బీఎస్పీ,బీఆర్ఎస్ పొత్తుపై ట్విటర్లో స్పందించిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.. కూటమిలో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీ తన అభ్యర్థులను నాగర్ కర్నూల్ (SC), హైదరాబాద్ నియోజకవర్గాల్లో బరిలో దించబోతుందని ట్వీట్ చేశారు. మిగతా నియోజకవర్గాల్లో బీఆరెఎస్ పోటీ చేయబోతుంది. రెండు పార్టీలు అన్ని చోట్ల పరస్పర సహకారంతో విజయం దిశగా ముందుకెళ్తామన్నారు.

ఈ చారిత్రాత్మక ఒప్పందానికి అనుమతించిన బీఎస్పీ అధినేత్రి మాయావతికి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడడానికి, దేశంలో బహుజనుల రక్షణకోసం ఈ పొత్తు ఒక చారిత్రాత్మక అవసరమన్నారు. తెలంగాణలో ఈ లౌకిక కూటమి నిస్సందేహంగా విజయ దుందుభి మోగించబోతుందన్నారు ఆర్ఎస్పీ