Delhi Liquor Scam: సుప్రీం కోర్టులో కవితకు చుక్కెదురు

0
28

లిక్కర్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురయ్యింది. బెయిల్ పై ట్రయల్ కోర్టుకు వెళ్లాలని కవిత తరఫు న్యాయవాదులకు సూచించింది. మహిళ కాబట్టి బెయిల్ పిటిషన్ పై జాప్యం లేకుండా విచారణ జరపాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. అయితే కవిత వేసిన రిట్‌ పిటిషన్‌కు సంబంధించి విచారించిన సుప్రీం..ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

తన అరెస్ట్ చట్టవిరుద్దమంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం విచారణ నిర్వహించింది. బెయిల్ తాము ఇవ్వలేమని ఎవరైనా కింది కోర్టును మొదట ఆశ్రయించాల్సిందేనని సుప్రీం స్పష్టం చేసింది. 6 వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని పిటిషనర్‌కు సూచించింది. కవిత కేసు జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరిగింది. కవిత తరపున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.

లిక్కర్ కేసులో ఈ నెల 15న అరెస్టయిన కవితకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు వారం రోజుల కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ నెల 23వ తేదీన ఆమెను తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంది. ఇదే కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సైతం ఈడీ అరెస్టు చేసింది. కేజ్రీవాల్ అరెస్ట్ పై అత్యవసర విచారణకి సుప్రీంకోర్టు అంగీకరించింది.