TG Politics: తొలిసారి ఎన్నికలకు దూరంగా కేసీఆర్ కుటుంబం

0
11

తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కుటుంబం మొదటిసారి ఎన్నికలకు దూరంగా ఉంటోంది. 2001లో పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి కేసీఆర్ ఫ్యామిలీ ఎన్నికలకు దూరంగా ఉండటం ఇదే తొలిసారి. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ , కేటీఆర్ హరీశ్‌రావు, కవితల్లో ఎవరో ఒకరు పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా జాబితాలో వారి పేర్లు ప్రకటించలేదు. కాగా ఆవిర్భావం నుంచి ప్రతి అసెంబ్లీ/పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ ఫ్యామిలీలో ఎవరో ఒకరు కచ్చితంగా పోటీ చేస్తూ వచ్చారు. కేసీఆర్ బంధువు బోయినపల్లి వినోద్ కుమార్ మాత్రం కరీంనగర్ నుంచి ప్రస్తుతం లోక్ సభ బరిలో నిల్చొంటున్నారు.

టీడీపీకి రాజీనామా చేసిన అనంతరం కేసీఆర్ 2001లో టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేసి ఉపఎన్నికలో భారీ మెజార్టీతో తిరిగి గెలుపొందారు. 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని సిద్దిపేట ఎమ్మెల్యేతో పాటు కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేసి విజయం సాధించారు. సిద్దిపేట శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడంతో వచ్చిన ఉపఎన్నికలో కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు పోటీ చేసి గెలుపొందారు.

ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో ఉప ఎన్నికల్లో కూడా విజయం సాధించి.. 2009 వరకు కరీంనగర్ ఎంపీగా కొనసాగారు. 2009లో మాత్రం కేసీఆర్.. మహబూబ్‌నగర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కేసీఆర్ మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా ఉన్న సమయంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు యూపీఏ సర్కార్ చర్యలు తీసుకుంది. అప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారమైంది.

ఇంకోవైపు ఇంతకాలం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేసీఆర్ సమీప బంధువు జోగినపల్లి సంతోష్ పదవీకాలం కూడా వచ్చే నెల 2న ముగిసిపోతున్నది. దీంతో పార్లమెంటు ఉభయ సభల్లో కేసీఆర్ ఫ్యామిలీ, బంధువులుగా ఒక్కరూ కూడా లేకపోవడం తొలిసారి