TG Politics: పార్టీ మారిన ఎంపీ రంజిత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు

0
20

బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచాకే రంజిత్ రెడ్డి ఎవరో ప్రపంచానికి తెలిసిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఎంపీ రంజిత్ రెడ్డికి బీఆర్ఎస్ వల్లే పేరొచ్చిందన్నారు . చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. కేవలం అధికారం, ఆస్ధుల కోసమే రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారని విమర్శించారు. 2019 లో రాజకీయాలకు కొత్త అయినా పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి ఆయనను గెలిపించారని చెప్పారు.

చేవెళ్ల నియోజకవర్గంలో ఏప్రిల్ 13వ తేదీన కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందన్నారు కేటీఆర్. ఒక పార్టీ కన్నా తానే పెద్ద అనే అహంకారం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో గెలబోరన్నారు . చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీకి కనీసం అభ్యర్థి కూడా దొరకలేదన్నారు. సొంతంగా అభ్యర్థి లేని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో గెలవడం అసాధ్యమన్నారు. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజులతో పాటు బీసీల కోసం కొన్ని దశాబ్దాలుగా అండగా నిలబడిన వ్యక్తి అని కొనియాడారు. ఓ వైపు బీసీల కోసం పాటుపడుతూనే, మరోవైపు అన్ని సామాజిక వర్గాలను, మైనార్టీలను కలుపుకుని పోయిన నాయకుడన్నారు.

చేవెళ్లలో బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ రావు, కాంగ్రెస్ నుంచి ఎంపీ రంజిత్ రెడ్డి, బీజేపీనుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.