IPl 2024: ఐపీఎల్ లో ఢిల్లీ బోణీ.. పంత్ కు 12 లక్షల ఫైన్

0
27

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌కు రూ.12లక్షలు ఫైన్ పడింది. రెండు వరుస పరాజయాల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలిచి ఢిల్లీ బోణీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆ జట్టు స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. దీంతో కెప్టెన్‌కు ఫైన్ పడింది. ఈ సీజన్‌లో ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12లక్షలు జరిమానా పడింది. పంత్ రెండో కెప్టెన్‌గా నిలిచారు.

నిన్న చెన్నై సూపర్ కింగ్స్‌ ను ఢిల్లీ చిత్తుచేసింది. వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచులో 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. వార్నర్, పంత్ అర్ధ సెంచరీలు చేయడంతో 192 పరుగులు చేసింది. ఛేదనలో సీఎస్కే 171 పరుగులకే పరిమితమైంది. ఆఖర్లో ధోనీ(16 బంతుల్లో 37*) మెరుపులు మెరిపించినా ప్రయోజనం లేకపోయింది. ఈ సీజన్‌లో చెన్నైకి ఇది తొలి ఓటమి కాగా ఢిల్లీకి మొదటి విజయం.

మరో వైపు ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ ప్రదర్శనపై ఆ జట్టు డైరెక్టర్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించారు. ‘రిషభ్ అద్భుతంగా ఆడావు. ఈ ఇన్నింగ్స్ నీకు జీవితాంతం గుర్తుండిపోతుంది. నీవు ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడినా ఇది నీకు ప్రత్యేకంగా నిలుస్తుంది’ అని పేర్కొన్నారు. ఏడాదిన్నర తర్వాత క్రికెట్ ఆడుతున్న పంత్ నిన్నటి మ్యాచులో అర్ధసెంచరీ చేసిన సంగతి తెలిసిందే.