BRS : సాయన్న కూతురు నివేదితకు కంటోన్మెంట్ టికెట్

0
15

సికింద్రాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పేరును అధినేత కేసీఆర్ ప్రకటించారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదితను కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేసీఆర్ అనౌన్స్ చేశారు. పార్టీ ముఖ్య నేతలు, స్థానిక నేతలతో చర్చించిన అనంతరం నివేదిత అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ఖరారు చేశారు. కాగా, దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. లాస్య నందిత అకాల మరణంతో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా.. ఈసీ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. పార్లమెంట్ ఎన్నికలతో పాటే మే 13వ తేదీన కంటోన్మెంట్ బై ఎలక్షన్ జరగనుంది. ఈ క్రమంలో కేసీఆర్ కంటోన్మెంట్ నుండి మరోసారి సాయన్న ఫ్యామిలీకే టికెట్ కేటాయించారు. సాయన్న చిన్న కూతురు, ఎమ్మెల్యే లాస్య సోదరి నివేదికు టికెట్ ఇచ్చారు. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కంటోన్మెంట్ అభ్యర్థిని ప్రకటించింది. ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన శ్రీ గణేష్‌కు టికెట్ ఇచ్చింది. బీజేపీ తమ పార్టీ అభ్యర్థి పేరును అనౌన్స్ చేయాల్సి ఉంది.