Aziz Qureshi : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కన్నుమూత

0
20

ఉత్తరప్రదేశ్‌ మాజీ గవర్నర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు అజీజ్‌ ఖురేషీ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 83 సంవత్సరాలు. సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఖురేషీకి ప్రస్తుతం 83 ఏళ్లు, అతని బాగోగులు చూసే అతని మేనల్లుడు సుఫియాన్ అలీ ఈ విషయాన్ని చెప్పారు. ఖురేషీ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మిజోరం రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు.

అజిజ్ ఖురేషి 1941 ఏప్రిల్ 24న భోపాల్‌లో జన్మించారు.1972లో మధ్యప్రదేశ్‌లోని సెహోర్ స్థానం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 1984లో లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈరోజు సాయంత్రం అజీజ్‌ ఖురేషీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 2020 జనవరి 24న అప్పటి కమల్‌నాథ్ ప్రభుత్వం ఖురేషిని మధ్యప్రదేశ్ ఉర్దూ అకాడమీకి అధ్యక్షునిగా నియమించింది.

ఖురేష్ కన్నుమూసిన వార్త తెలియగానే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఖురేషి మృతికి కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.