CBN: రామోజీరావు తెలుగు వెలుగు- నారా చంద్రబాబు నాయుడు

0
9

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు (88) శనివారం కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఈ తెల్లవారుజామున 4.50కి రామోజీరావు తుదిశ్వాస విడిచారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని నివాసానికి పార్థివదేహం తరలించనున్నారు. కొద్దిరోజులుగా రామోజీరావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఈ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా గుడివాడలో రామోజీరావు జన్మించారు. 2016లో పద్మవిభూషన్ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య. కాగా, రామోజీరావు మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు నారా చంద్రబాబు నాయుడు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని భావించా.. కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేశారని.. ఆయన తెలుగు ప్రజల ఆస్తి. తెలుగు వెలుగు. ఆయన మరణం రాష్ట్రానికే కాదు దేశానికే తీరని లోటు అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు తెలిపారు.