PM Modi: భారత ప్రధాని మోదీకి పుతిన్ ప్రైవేట్ విందు.

0
27

పాయింట్ బ్లాంక్, వెబ్ డెస్క్: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ మాస్కోలో ఘన స్వాగతం పలికారు. తన ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో భారత ప్రధానికి పుతిన్ ప్రైవేటు విందు ఇచ్చారు. ఈ విందు సందర్భంగా ఇరువురు నేతలు స్నేహపూర్వక అంశాలపై మాట్లాడుకున్నారు. అనంతరం రష్యాలోని ప్రవాస భారతీయ ప్రముఖులతో ప్రధాని ఆప్యాయంగా ముచ్చటించారు. ఇక మంగళవారం రోజు భారత్-రష్యా 22వ వార్షిక సదస్సు వేదికగా మోదీ, పుతిన్ మధ్య అధికారిక చర్చలు జరగనున్నాయి. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం, రక్షణ ఒప్పందాలు, పశ్చిమాసియా యుద్ధ వాతావరణంపై వారు ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు సోమవారం ఉదయం మాస్కోలో దిగగానే భారత ప్రధాని మోదీకి రష్యా ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్ స్వాగతం పలికారు. రష్యా సైన్యం గార్డ్ ఆఫ్ హానర్‌‌‌‌తో.. దాండియా, గార్భా నృత్యంతో రష్యా కళాకారులు భారత ప్రధానిని స్వాగతించారు. మోదీ బస చేస్తున్న హోటల్ వెలుపల పలువురు భారతీయులు భజనలు పాడి నృత్యాలు చేశారు. మోదీ, పుతిన్‌ కరచాలనం చేసుకునే ఫ్లెక్సీలను వారు ప్రదర్శించారు. రష్యాలో భారత ప్రధాని పర్యటనను పురస్కరించుకుని ఐరోపాలో అత్యంత ఎత్తైన నిర్మాణమైన ఒస్టాంకినో టవర్‌ను సోమవారం రోజు భారత త్రివర్ణ పతాకంతో వెలిగించారు. రష్యా పర్యటన ముగిసిన వెంటనే మోదీ నేరుగా ఆస్ట్రియాకు వెళ్లనున్నారు.