AP POLITICS : విజయవాడ పశ్చిమను ఆదర్శంగా నిలుపుతా- సుజనా చౌదరి

0
11

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం 47వ డివిజన్ లో సీనియర్ నాయకులతో కలిసి.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ పార్టీ అభ్యర్థి సుజనా చౌదరి పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.., పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి మరోసారి స్పష్టం చేశారు. అయనకు కొండ ప్రాంత ప్రజలు సమస్యలు చెప్పుకొచ్చారని.. జగన్ ప్రభుత్వం తమను మోసం చేసిందని మొరపెట్టుకున్నారని సుజనా చౌదరి తెలిపారు. పాలకుల నిర్లక్ష్యంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వెనుకబడిపోయిందని, ప్రజల ఇబ్బందులు తనను ఆవేదనకు గురి చేస్తున్నాయని అయన అన్నారు.

కాగా, విజయవాడ వన్ టౌన్ అంటే అభివృద్ధిలో ముందుండాలని.. కానీ ఆధునిక కాలంలో కూడా ఇంత వెనుకబడి ఉందంటే ఆశ్చర్యం కలుగుతోందని అయన మండిపడ్డారు. అభివృద్ధి చేశామని చెబుతున్నవారు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని సుజనా డిమాండ్ చేశారు. అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను పాలకులు మోసం చేశారని దుయ్యబట్టారు. ఓట్ల కోసం హామీలు ఇచ్చి అమలు చేయనివారిని రీకాల్ చేసే విధానం రావాలని.. అప్పుడు ప్రజలను ప్రజా ప్రతినిధులు మోసం చేయలేరని సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర, రాష్ట్రాల్లో తనకున్న పరిచయాలతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని సుజనా చౌదరి హామీ ఇచ్చారు. రాజ్యసభ సభ్యుడిగా, సుజనా ఫౌండేషన్ పేరుతో ఎంతో అభివృద్ధి, సేవ చేశానని అయన గుర్తు చేశారు.

అలానే విజయవాడ కనకదుర్గమ్మ తనకు ప్రత్యక్షంగా పోటీ చేసే అవకాశం కల్పించిందని.., ప్రధాని మోదీని ఈ నియోజకవర్గానికి తీసుకొస్తానని సుజనా తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధికి ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసినట్టు వివరించారు. సుజనాకు మద్దతుగా బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా, జనసేన నాయకులు బాడిత శంకర్, టీడీపీ మాజీ కార్పొరేటర్ గుర్రంకొండ, ఓబీసీ మోర్చా, ఏపీ మీడియా కన్వీనర్ మానేపల్లి మల్లికార్జునరావు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.