Breaking: కవితకు మరో బిగ్ షాక్.. రెండు బెయిల్ పిటిషన్లు తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు

0
11

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. కవిత దాఖలు చేసిన రెండు బెయిల్ పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐల వాదనలతో ఏకీభవించిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ కవితకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించారు. దీంతో కవితకు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం కవిత తీహార్ జైలులో ఉన్నారు. ఈ క్రమంలోనే సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్ ఇవ్వాలంటూ కవిత రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోగా.. ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్టు నిరాకరించింది. దీంతో కవిత బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కవిత బెయిల్ పిటిషన్లపై ఇరువర్గాల వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు.. ఎట్టకేలకు ఇవాళ జడ్జిమెంట్ ఇచ్చింది. కవితకు మరోసారి న్యాయస్థానంలో ఊరట దక్కకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. అయితే, హై కోర్టు తీర్పును కవిత సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేస్తారా..? లేదా..? అనేది ఉత్కంఠగా మారింది.