TS Poilitcs: రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్.. సత్తా ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలన్న కేటీఆర్.

0
38

పాయింట్ బ్లాంక్, వెబ్ డెస్క్: నిరుద్యోగులను రెచ్చగొట్టాల్సిన అవసరం తమకు లేదని.. సీఎం రేవంత్‌ రెడ్డి(Revanth Reddy)కి సత్తా ఉంటే.. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR). అదివారం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు..? ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు..? మీరిచ్చిన జాబ్‌ క్యాలెండర్‌(Job Calender)లో ఎన్ని మాటలు నిలబెట్టుకున్నారో స్పష్టంగా ఒక శ్వేతపత్రం(White Paper) ప్రకటించాలని అన్నారు. 8 నెలల్లో ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వని మీరు.. మిగిలిన నాలుగు నెలల్లో ఏ విధంగా రెండు లక్షల నోటిఫికేషన్లు ఇస్తారో చెప్పాలని నిలదీశారు కేటీఆర్.

మాట నిలబెట్టుకునేదాకా వదిలిపెట్టం..!
ఇచ్చిన మాటను నిలబెట్టుకునేదాకా వదిలిపెట్టమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఏ నిరుద్యోగుల్ని అయితే మోసం చేశావో.. వాళ్లకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డి అడ్డగోలు వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా ముఖ్యమంత్రి తన స్థాయికి దిగజారి మాట్లాడారని ఫైర్ అయ్యారు. నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్న మోతీలాల్‌(motilal naik)ను అవమానించేలా మాట్లాడారాన్నారు. బక్క జడ్సన్(Bakka Judson) దీక్ష చేస్తే ఏ ఉద్యమం కోసం దీక్ష చేస్తున్నాడు అని అంటున్నాడు.. మరి గాంధీ భవన్(Gandhi Bhavan) లో 2023లో రేవంత్ రెడ్డి ఏ ఉద్యోగం కోసం దీక్ష చేశాడు..? అని ప్రశ్నించారు కేటీఆర్.

రాహుల్ గాంధీ ఏ పరీక్ష రాస్తున్నాడని అశోక్ నగర్ వచ్చిండు..?
సీఎం రేవంత్ రెడ్డి అశోక్ నగర్ సన్నాసులు అని మాట్లాడుతున్నాడు అదే అశోక్ నగర్‎కి నువ్వు(రేవంత్ రెడ్డి), రాహుల్ గాంధీ(Rahul Gandhi) వచ్చారు మరి ఎవరు సన్నాసులు అని మండిపడ్డారు. శనివారం అర్ధరాత్రి దిల్‍సుఖ్‍నగర్, అశోక్ నగర్‎లో దీక్ష చేసింది వాస్తవం కాదా..? ఉస్మానియాలో ఈరోజు(అదివారం) ఉదయం అరెస్ట్ చేసింది వాస్తవం కాదా..? ఆరు నెలల్లోనే ప్రజా పాలన అంటే ఎమర్జెన్సీ పాలనని పిల్లలు బాధపడేది వాస్తవం కాదా..? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. గద్దెనెక్కించిన యువతే మిమ్మల్ని ప్రశ్నిస్తోందన్నారు. సీఎం ఇకనైనా అహంకారం, కండకావరంతో మాట్లాడే విధానాన్ని తగ్గించు కోవాలని సూచించారు. నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి.. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాట నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..