AP Politics: బడ్జెట్‌లో ఏపీకి న్యాయం చేయండి.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన సీఎం చంద్రబాబు.

0
36

పాయింట్ బ్లాంక్, వెబ్‌ డెస్క్: రాష్ట్రాభివృద్ధిపై సీఎం చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్ర విభజన గత ఐదేళ్ల వైసీపీ పాలన కారణంగా పూర్తిగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ఈనెల 23న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రత్యేక సాయం ప్రకటించాలని కేంద్ర మంత్రి అమిత్ షా(Amit Sha)ను సీఎం చంద్రబాబు కోరారు. బడ్జెట్ అంశంపై చర్చించడానికి మంగళవారం రాత్రి ఢిల్లీ(Delhi) చేరుకున్న చంద్రబాబు.. రాత్రి 9 గంటలకు కృష్ణమీనన్‌మార్గ్‌లోని హోం మంత్రి నివాసంలో అమిత్ షాతో భేటీ అయ్యారు.

గత ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతలా దిగజారిందో అమిత్ షాకు వివరించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇప్పటివరకు విడుదల చేసిన 4 శ్వేతపత్రాలపై ఆయనతో చర్చించినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వ అసమర్థత, అవినీతి రాష్ట్రానికి తీరని నష్టాన్ని కలిగించాయని ట్వీట్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెడతాయని చెప్పారు. ఈక్రమంలో ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ధ్వంసమైన రోడ్లు బాగు చేసేందుకు చేయూతనిచ్చి, కొత్త జాతీయ రహదారులు, రైలు మార్గాలు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు విన్నవించారు.