NCBN: ప్రతి శనివారం ప్రజలతో సీఎం చంద్రబాబు

0
61

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: గత ప్రభుత్వ హయాంలో అధికారుల స్థాయిలో సమస్యల పరిష్కారానికి నోచుకోకుంటే నేరుగా సీఎంను కలిసి తమ బాధ వెళ్లబోసుకోవాలని ప్రజలు ప్రయత్నించారు. తొలుత అప్పటి సీఎం జగన్​ ఓ ప్రయత్నం చేశారు. కానీ దాన్ని కొనసాగించలేదు. దాదాపు ఐదేళ్లపాటు ఆయన అసలు ప్రజలను కలుసుకోవడానికే ఇష్టపడలేదు. కేవలం సభల్లో పాల్గొని మాట్లాడడానికే ప్రాధాన్యమిచ్చారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు మాత్రం జగన్​ చేసిన తప్పును చేయదలచుకోలేదని తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటి నుంచే తనను ప్రజల నుంచి దూరం చేయొద్దని భద్రతా సిబ్బంది, పోలీసులకు మార్గదర్శకాలు జారీ చేశారు.

కాగా, ప్రతి శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. అక్కడ పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్నారు. పూల బొకేలతో వచ్చి ఫొటోలు దిగడానికి ఎక్కువ మంది వస్తున్నారు. దీంతో తీవ్రమైన రద్దీ చోటుచేసుకుంటుంది. సమస్యల పరిష్కారం కోసం వచ్చే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓ మహిళ చంద్రబాబును కలిసి ఇదే విషయాన్ని చెప్పిందట. దీంతో తాను వారానికి ఒకరోజు ప్రజలను కలుసుకోవడానికి ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాన్ని రూపొందించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును సీఎం చంద్రబాబు ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు పార్టీ ఓ టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేసింది. 7306299999 నంబరుకు కాల్​చేసి తమ సమస్యను వివరిస్తే వాళ్లకు ఓ రోజు కేటాయిస్తారు. అలా ప్రతి శనివారం 500 మందికి సీఎం చంద్రబాబును కలిసే అవకాశం కలుగుతుంది. సమస్య ప్రాధాన్యాన్ని బట్టి అర్జీదారులకు సమయాన్ని కేటాయించనున్నారు. దీనివల్ల రద్దీ తగ్గడంతోపాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి దోహదపడుతుంది. ఈ పాటికే చంద్రబాబు జిల్లా స్థాయిలో గ్రీవెన్స్ రెడ్రసల్​ సిస్టమ్ పక్కాగా నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. అందువల్ల అధికారుల స్థాయిలో సమస్య పరిష్కారం కాకుంటే నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు పార్టీ అవకాశం కల్పించింది.