TS POLITICS : నిజామాబాద్ సభలో కవితపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

0
10

నిజమాబాద్ : నిజామాబాద్ నుంచి 2014లో ఎంపీగా గెలిచిన కవిత ఏం చేశారో చెప్పాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొన్న అయన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు స్థానిక ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అర్వింద్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిజామాబాద్ ప్రజలను వీరిద్దరూ మోసం చేశారని.. ఈ నియోజకవర్గానికి కవిత ఏం చేశారు? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. అందుకే నిజామాబాద్ ప్రజలు ఆమెను ఓడించారన్నారు. కవిత ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడి రైతులను పట్టించుకోలేదన్నారు.

మరోవైపు ధర్మపురి అర్వింద్ స్పైసిస్ బోర్డు తీసుకువచ్చి పసుపు బోర్డుగా చెబుతున్నారని మండిపడ్డారు. ఇక్కడి రైతులు అందరూ ప్రతి విషయాన్ని గమనిస్తున్నారన్నారు. ఇండియా కూటమి గెలిస్తే పసుపు బోర్డు తీసుకు వస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్. సెప్టెంబర్ 17లోగా బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి వారి రుణం తీర్చుకుంటామని పేర్కొన్నారు. నిజామాబాద్ లోక్‎సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డికి ఓటు వేస్తే రేవంత్ రెడ్డికి వేసినట్లేనని… నిజామాబాద్‎లో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా అని సీఎం తెలిపారు.

అలానే ప్రధాని నరేంద్ర మోదీ మతాల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. మతాలను కూడా రాజకీయాలకు బీజేపీ వాడుకుంటోందని ఆరోపించారు. వరి వేస్తే ఉరి అని చెప్పిన కేసీఆర్ తన ఫాంహౌస్‌లో మాత్రం వరి వేశారని విమర్శించారు. రైతులు ఎంత పంట అయినా పండించవచ్చునని… ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని సీఎం రేవంత్ రెడ్డి హామి ఇచ్చారు.