Hyd: నేను ప్రభుత్వ బడిలోనే చదివాను- సీఎం రేవంత్ రెడ్డి

0
15

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: 90 శాతం మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ పాఠాశాలల్లో చదివినవారేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొని స్టూడెంట్స్‌కు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. వందేమాతరం ఫౌండేషన్ ఇలాంటి మంచి కార్యక్రమం ద్వారా మా బాధ్యతను గుర్తు చేసిందన్నారు. ప్రయివేట్ పాఠశాలలతో పోటీపడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాణించడం ప్రభుత్వానికి గర్వకారణమని కొనియాడారు. కార్పొరేట్ పాఠశాలలతో విద్యార్థులు పోటీపడటం మా గౌరవాన్ని మరింత పెంచింది సంతోషం వ్యక్తం చేశారు.

తనతో సహా ప్రముఖ రాజకీయ నాయకులంతా ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారేనని.., విద్యార్థులు రావడం లేదని పాఠశాలలను మూసివేసే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేదని.. మౌలిక వసతులపై దృష్టి కేంద్రీకరించకపోవడం వల్లే ఆ పరిస్థితి తలెత్తిందని రేవంత్ మండిపడ్డారు. కానీ సింగిల్ టీచర్ పాఠశాలలను మూసేయొద్దని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.., ప్రతీ గ్రామం, ప్రతీ తండాకు విద్యను అందించేలా ప్రభుత్వం ముందుకెళుతుందని స్పష్టం చేశారు. శిథిలావస్థకు చేరిన అన్ని ప్రభుత్వ పాఠశాలల భవనాలను పునర్నిర్మించేందుకు రూ. 2వేల కోట్లతో పనులు ప్రారంభించామని తెలిపారు. విద్యార్థులను బడిలో చేర్పించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించామని.. గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.