IPL 2024: గేల్ రికార్డు సమం చేసిన వార్నర్

0
39

ఢిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టీ20 క్రికెట్‌లో రికార్డు సృష్టించారు. చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆయన అర్ధ సెంచరీ బాదారు. దీంతో కలుపుకుని ఆయన ఇప్పటివరకు 110 ఫిఫ్టీలు సాధించారు. ఐపీఎల్‌-2024లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో 52 పరుగులు చేసిన వార్నర్‌.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు.

ఈ క్రమంలో వెస్టిండీస్ విధ్వంసకవీరుడు క్రిస్ గేల్ (110) రికార్డును సమం చేశారు. ఈ ఏడాది సీజన్‌లో గేల్‌ రికార్డును వార్నర్‌ బ్రేక్‌ చేసే ఛాన్స్‌ ఉంది. వీరి తర్వాతి స్ధానాల్లో టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి ఉన్నాడు. కోహ్లి టీ20ల్లో ఇప్పటివరకు 101 సార్లు ఫిప్టీ ప్లస్‌ పరుగులు సాధించాడు. కాగా వార్నర్ ఐపీఎల్‌లో 62 హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. ఆయన ఖాతాలో 4 శతకాలు కూడా ఉన్నాయి.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచులో 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. వార్నర్, పంత్ అర్ధ సెంచరీలు చేయడంతో 192 పరుగులు చేసింది. ఛేదనలో సీఎస్కే 171 పరుగులకే పరిమితమైంది. ఆఖర్లో ధోనీ(16 బంతుల్లో 37*) మెరుపులు మెరిపించినా ప్రయోజనం లేకపోయింది. ఈ సీజన్‌లో చెన్నైకి ఇది తొలి ఓటమి కాగా ఢిల్లీకి మొదటి విజయం.