HYDRA: సోదరుడిని వదలని రేవంత్ రెడ్డి.. ఇక బీఆర్‌ఎస్ నేతలకు దబిడి. దిబిడే..!

0
19
Tirupatireddy and Revanth Reddy
Tirupatireddy and Revanth Reddy

హైదారాబద్‌లో హైడ్రా దూకుడు తగ్గడం లేదు.. రోజురోజుకు యమ స్పీడ్‌లో దూసుకుపోతుంది. తన, మన బేధాలు లేకుండా అందరికీ ఒకటే రూల్ అంటూ ఆక్రమణదారులకు చుక్కలు చూపిస్తోంది. చివరికి సీఎం రేవంత్ రెడ్డి సోదరుడుని హైడ్రా వదిలిపెట్టేలా కనిపించడం లేదు. ఆక్రమణలకు పాల్పడ్డవారు ఎంతటి వారైనా వదలిపెట్టేది లేదంటోంది ప్రభుత్వం. తాజాగా.. సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటికి కూల్చివేత నోటీసులు అంటించారు. తెలంగాణ పాలిటిక్స్‌లో ప్రస్తుతం ఈ అంశం హట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్ నగరంలోని దుర్గంచెరువు చుట్టూ అక్రమ కట్టడాలు ఎన్నో వెలిశాయి. అక్రమ నిర్మాణాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు, కార్యాలయంతో సహా పలు ప్రముఖ నిర్మాణాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. అక్రమ నిర్మాణాలను 30 రోజుల్లోగా తొలగించాలని నోటీసులు అంటించారు. డిప్యూటీ కలెక్టర్ హోదా కలిగిన శేరిలింగంపల్లి తహశీల్దార్ నేతృత్వంలో రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. చెరువుకు ఆనుకుని ఉన్న నెక్టార్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్, అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేశారు. వాల్టా చట్టంలోని సెక్షన్ 23(1) కింద ఈ నోటీసులు అందజేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాటిని నిర్ణీత గడువులోగా స్వచ్ఛందంగా కూల్చివేయాలని ఆదేశించారు. లేదంటే అధికారులే కూల్చివేతలు చేపడతారని హెచ్చరించారు. సిటీ మధ్యలో ఉన్న దుర్గంచెరువు, తీగలవంతెన హైదరాబాద్‌కి ఐకాన్‌గా మారిపోయింది. ఒకప్పుడు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉండే దుర్గం చెరురవు ప్రస్తుతం 84 ఎకరాలకు పరిమితమైంది. దాదాపు 16 ఎకరాలకు పైగా కబ్జాకు గురైంది. పదేళ్ల కిందట ఈ ఏరియాను నాన్-డెవలప్‌మెంట్ జోన్‌గా గుర్తించారు. దీనికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో క్రమంగా విస్తీర్ణం తగ్గిపోతూ వచ్చింది. దుర్గం చెరువు చుట్టూ ఎన్నో విలాసవంతమైన విల్లాలు వెలిశాయి. రాజకీయ నాయకులు, ఇంజినీర్లు, రిటైర్డ్ బ్యూరోక్రాట్‌లు, ఎంతోమంది ఉన్నత స్థాయి వ్యక్తులు ఈ చెరువు చుట్టూ.. ఆక్రమణకు గురైన ప్రాంతాల్లో నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. వారిలో చాలామందికి అధికారులు నోటీసులు జారీచేశారు.

భిన్నభిప్రాయాలు..

హైడ్రా కూల్చివేతలపై కొద్దిరోజులుగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు తాము వ్యతిరేకం కాదని.. ముందు తన ఇంటి నుంచి మొదలుపెట్టాలంటూ బీఆర్‌స్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీఎం సొంత సోదరుడు ఎఫ్‌టిఎల్ పరిధిలో నివసిస్తున్నారని.. ఆయన భవనం కూల్చిన తర్వాత మిగతావి కూల్చాలని స్వయంగా కేటీఆర్ డిమాండ్ చేశారు. తాజాగా తిరుపతిరెడ్డి నివాసానికి అధికారులు నోటీసులు జారీచేయడంతో బీఆర్‌ఎస్ నేతల్లో ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది. సొంత సోదరుడిని వదలిపెట్టకపోవడంతో ఇక బీఆర్‌ఎస్ నేతలకు చెందిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపనున్నట్లు స్పష్టమవుతోంది. తిరుపతిరెడ్డికి చెందిన భవనానికి నోటీసులు ఇవ్వడంతో మరికొద్దిరోజుల్లో హైడ్రా అధికారులు ఆ భవనంతో పాటు చుట్టుపక్కల అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం లాంఛనమే కానుంది. సొంత సోదరుడిని వదిలిపెట్టకపోవడంతో రేవంత్‌కు ప్రజల మద్దతు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ప్రజలు హైడ్రాకు జైజేలు కొడుతున్న సంగతి తెలిసిందే.

తిరుపతిరెడ్డి స్పందన

హైడ్రా నోటీసులపై సీఎం రేవంత్‌ సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. 2015లో అమర్‌సొసైటీలో నివాసాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. కొనుగోలు సమయంలో ఎఫ్‌టీఎల్‌లో ఉందనే సమాచారం లేదని.. ఆ పరిధిలో ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదని తిరుపతి రెడ్డి స్పష్టం చేశారు. దీంతో తాను ప్రస్తుతం నివాసం ఉంటున్న భవనాన్ని వదులుకోవడానికి ఆయన సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఇక బీఆర్‌ఎస్ నేతలు సైతం స్వచ్ఛందంగా తమ భవనాలను కూలుస్తారా.. లేదంటే అక్కడి నుంచి ఖాళీచేసి హైడ్రా అధికారులకు స్వేచ్చనిస్తారా అనేది వేచి చూడాలి.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Latest News Click Here