TS POLITICS : భువనగిరిలో మూడోసారి కాంగ్రెస్ జెండా ఎగురుతోంది- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

0
17

నకిరేకల్ : జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి గడ్డపై మూడోసారి కాంగ్రెస్ జెండా ఎగురుతుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గంటపదంగా చెప్పారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిలతో కలిసి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. గత పదేళ్లలో కేసీఆర్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం చేసిన పాపాలకు జైలు జీవితం తప్పదని.., ఆయన కూతురు వచ్చే బతుకమ్మను జైల్లోనే నిర్వహించుకోవాలన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని.. గుర్తు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నామని.. కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకోవచ్చు అన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో కొంతమంది గుంట నక్కలు మోసం చేశారని.. వారికి తగిన బుద్ధి చెప్పిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో రామన్నపేట మండలం నుంచి అత్యధిక మెజారిటీ రావాలని కోరారు.

అలానే చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.., రామన్నపేటను నియోజకవర్గ కేంద్రంగా మార్చుకునేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. రామన్నపేట రైల్వే స్టేషన్‎లో ప్రతి ఒక్క రైలు ఆగేవిధంగా పోరాడుతానన్నారు. అదేవిధంగా 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో శాసన మండలి డిప్యూటీ మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు, ఎంపీపీ పూస బాలమణి కిషన్, జడ్పిటిసి పున్న లక్ష్మీ జగన్మోహన్, మండల పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి మల్లారెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు.