TS Politics: తెలంగాణలో కక్షపూరిత రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి- ఎంపీ ఈటల రాజేందర్

0
27

పాయింట్ బ్లాంక్, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ కార్యకర్తలు ప్రజల కృతజ్ఞత సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. 44 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ గడ్డమీద బీజేపీ సంపూర్ణంగా జెండా ఎగుర వేసిందన్నారు. మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, మెదక్, చేవెళ్ల స్థానాలను గెలుచుకుందనీ తెలిపారు. అలానే స్థానిక సంస్థలలో విజయం సాధించడమే మన లక్ష్యమని.. బీజేపీ వారసత్వ రాజకీయాలతో వచ్చిన పార్టీ కాదని.. మనకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి అని తెలిపారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులుగా మీకు నిత్యం అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తాననీ.. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి ఎన్నికల వరకు బీజేపీ కొట్లాడుతుందని స్పష్టం చేశారు. నాయకులు ఎలా ఉన్నా.. పార్టీ కార్యకర్త బరిగీసి కొట్లాడుతారని తెలిపారు. పార్టీ జెండాకి అవమానం జరిగితే తట్టుకోలేరన్నారు. నాకు కన్స్ట్రక్షన్ తప్ప డిస్టెక్షన్ తెలియదు.. కలవడం తప్ప విడదీయడం తెలియదు. గడ్డిపోచను కూడా గౌరవిస్తాను.. ఎర్ర చీమకు కూడా అన్యాయం చేయనని తెలిపారు ఎంపీ ఈటల రాజేందర్.