Mega Brothers: మెగా సోదరులను ఆప్యాయంగా పలకరించిన ప్రధాని మోదీ

0
8

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకార వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మెగా సోదరులను ప్రధాని నరేంద్ర మోదీ ఆప్యాయంగా పలకరించారు. ఆపై మెగస్టార్ ఓవైపు, పవర్ స్టార్‎ను మరోవైపు నిలబెట్టుకుని సభకు హాజరైన ప్రజలకు అభివాదం చేశారు. దీంతో మెగా అభిమానులు చప్పట్లతో హర్షం వ్యక్తంచేశారు. వేదికపై ఆ ముగ్గురిని పక్కపక్కనే చూసి అభిమానులు చేసిన కరతాళ ధ్వనులతో సభా ప్రాంగణం మార్మోగింది. వేదికపై ప్రధాని మోదీతో నాన్న, బాబాయ్‎లను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంతోషంగా చూస్తుండడం కనిపించింది.

అంతకుముందు సీఎం, మంత్రుల ప్రమాణస్వీకారం పూర్తయ్యాక ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫొటోలకు పోజిచ్చారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పవన్ ను మోదీ అభినందించారు. ఆపై ప్రధాని మోదీని పవన్ కళ్యాణ్ తన సోదరుడు చిరంజీవి వద్దకు తోడ్కొని వెళ్లారు. మెగా సోదరులు ఇద్దరినీ దగ్గరకు తీసుకున్న మోదీ.. వేదిక పైనుంచి ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీని సూపర్ స్టార్ రజనీకాంత్ వద్దకు తోడ్కొని వెళ్లారు. రజనీకాంత్ తో పాటు పక్కనే ఉన్న బాలకృష్ణను మోదీ పలకరించి, వారితో కరచాలనం చేశారు. తర్వాత ఒక్కొక్కరిగా వేదికపై ఉన్న ఎన్డీయే కూటమి నేతలను, కేంద్ర మంత్రులను, మాజీ సీజేఐ జస్టిస్ NV రమణ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులతో ప్రధాని నరేంద్ర మోదీ కరచాలనం చేశారు.