YSRCP: విదేశాలకు జగన్.. వైసీపీలో సెప్టెంబర్ సంక్షోభం తప్పదా..?

0
16
YS Jagan
YS Jagan

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆగష్టు సంక్షోభం వెరీ ఫేమస్. తెలుగుదేశం పార్టీలో రెండు సార్లు ఆగష్టులోనే రాజకీయ సంక్షోభం తలెత్తింది. దీంతో ఆగష్టు సంక్షోభం ఫేమస్ అయింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో వైసీపీని సెప్టెంబర్ సంక్షోభం కలవర పెడుతోంది. వరుసగా పార్టీకి సీనియర్ నేతలు గుడ్‌ బై చెప్పేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్‌ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇంతకాలం జగన్‌ను నెత్తిన పెట్టుకున్న నాయకులే ప్రస్తుతం తిరుగుబాటు చేయడం వైసీపీ శ్రేణులను తెగ ఇబ్బంది పెడుతోంది. సీనియర్ నేతలు పార్టీని వీడుతుంటే స్థానిక నాయకత్వం సైతం అయోమయంలో కొట్టుమిట్టాడుతోందట. మరోవైపు పార్టీ అధినేత జగన్ సైతం తిరుగుబాటు నాయకుల గురించి ఏమి మాట్లాడకపోవడం, వలసల నివారణకు చర్యలు తీసుకోకపోవడంతో భవిష్యత్తులో పార్టీ మనుగడపై వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడుతుండగా.. కరుడుగట్టిన వైసీపీ నాయకులుగా పేరొందిన వ్యక్తులు పార్టీలో కీలక నేతలపై బహిరంగ విమర్శలు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది.

పార్టీని వీడుతున్న నేతలు..

వైసీపీలో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే సెప్టెంబర్ సంక్షోభం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే ఇద్దరు రాజ్యసభ సభ్యులు వైసీపీని వీడగా..తాజాగా ఇద్దరు ఎమ్మెల్సీలు షాక్ ఇచ్చారు. మరికొంతమంది రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు సమయం కోసం వేచి చూస్తున్నారు. పార్టీ మారాలనే ఆలోచనతో ఉన్న వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నా.. ఫలితం కనిపించడం లేదట. మరోవైపు వైసీపీ అధినేత జగన్ సెప్టెంబర్3వ తేదీన విదేశాలకు వెళ్లనున్నారు. 20 రోజుల పాటు యూకేలో ఉంటారు. జగన్ విదేశీ పర్యటన సమయంలోనే పార్టీ మారేందుకు రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు రంగం సిద్దం చేసుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. వైసీపీలో గత కొద్దిరోజులుగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నా.. అధినేత నోరు మెదకపోవడంపై పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్‌లో కేవలం పార్టీ ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు పార్టీ మారతారా.. లేదంటే వైసీపీలో చీలక తెస్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది. జగన్ నిర్ణయాలు, వ్యవహరశైలి నచ్చని నాయకులంతా కలిసి వైసీపీలో చీలక తేచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంటే.. ఇదంత ఈజీ కాదనే చర్చ మరోవైపు సాగుతోంది.

సంక్షోభం తప్పదా..!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల చేసిన వ్యాఖ్యలు సైతం వైసీపీలో సంక్షోభం తప్పదనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది. జగన్ లాంటి వ్యక్తులు పార్టీని నడపడం కూడా రాష్ట్రానికి ప్రమాదమని చంద్రబాబు తన అభిప్రాయంగా చెప్పారు. అంటే వైసీపీలో చీలక వస్తుందని చంద్రబాబు ముందే అంచనా వేశారా అనే చర్చ జరుగుతోంది. ఐదేళ్లపాటు జగన్ వెంట నడిచిన నాయకులు అధికారం పోయిన తరువాత జగన్‌పై విమర్శలు మొదలుపెట్టారు. జగన్ అసలు స్వరూపాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీని, అధినేత జగన్‌‌ను విపరీతంగా అభిమానించిన వారు సైతం ప్రస్తుతం జగన్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చూస్తే జగన్‌పై ప్రజలు వ్యతిరేకంగా ఉన్న విషయం స్పష్టమవుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఉన్నంతకాలం ఆ పార్టీని వైసీపీ ఎదుర్కొనే అవకాశాలు తక్కువనే చర్చ నడుస్తోంది. తమ పరిపాలనతో ఓవైపు కూటమి ప్రజల మద్దతు కూడగట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ రోజురోజుకు బలహీనపడుతోంది. ఈక్రమంలో రాబోయే రోజుల్లో ఏపీలో పొలిటికల్ స్పెచ్ ఉంటుందనే అంచనాతో వైసీపీలో కొందరు నేతలు తిరుగుబాటు చేసేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Latest News Click Here