TS Politics: ప్రధాని మోదీని కలిసిన తెలంగాణ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి.. ఆ అంశాల మీద చర్చ

0
32

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: సింగ‌రేణి ప‌రిధిలోని బొగ్గు గ‌నుల‌ను సింగ‌రేణికే కేటాయించాల‌ని.. ప్ర‌స్తుతం వేలంలో పెట్టిన శ్రావ‌ణప‌ల్లి బొగ్గు బ్లాక్‌ను వేలం జాబితా నుంచి తొల‌గించాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ప్రధాని మోదీ నివాసంలో మ‌ధ్యాహ్నం కలిశారు. ప్ర‌భుత్వ రంగంలో ఉన్న సింగ‌రేణి కాల‌రీస్ కంపెనీ (ఎస్‌సీసీఎల్‌)లో తెలంగాణ ప్ర‌భుత్వానికి 51 శాతం.., కేంద్ర ప్ర‌భుత్వానికి 41 శాతం వాటాలున్న‌ట్లు ప్రధాని మోదీ దృష్టికి సీఎం రేవంత్ తీసుకెళ్లారు. గనులు, ఖ‌నిజాభివృద్ధి నియంత్ర‌ణ చ‌ట్టంలోని (ఎంఎండీఆర్‌) సెక్ష‌న్ 11A/17(A)(2) ప్ర‌కారం వేలం జాబితా నుంచి శ్రావ‌ణ‌ప‌ల్లి గ‌నిని తొల‌గించాల‌ని.., అదే సెక్ష‌న్ ప్ర‌కారం గోదావ‌రి లోయ‌ బొగ్గు నిల్వ‌ల క్షేత్రం ప‌రిధిలోని కోయ‌గూడెం, స‌త్తుప‌ల్లి బ్లాక్ 3 గ‌నుల‌నూ సింగ‌రేణికే కేటాయించాల‌ని ప్ర‌ధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలోని విద్యుదుత్ప‌త్తి కేంద్రాల అవ‌స‌రాలు తీర్చేందుకు ఈ గ‌నుల కేటాయింపు కీల‌కమైనందున, సింగ‌రేణికే వాటిని కేటాయించాల‌ని ప్ర‌ధాన‌మంత్రికి ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. బొగ్గు గ‌నుల కేటాయింపు, ఐటీఐఆర్ పున‌రుద్ధ‌ర‌ణ‌, ర‌క్ష‌ణ భూముల కేటాయింపు, రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాలపై ప్రధాని మోదీతో సీఎం రేవంత్ చ‌ర్చించారు. ప్ర‌ధాన‌మంత్రి నివాసానికి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి సుమారు గంట‌సేపు రాష్ట్రానికి సంబంధించిన అంశాల‌పై మోదీతో చ‌ర్చించారు.

కాగా, 2010 సంవ‌త్సరంలో నాటి యూపీఏ ప్ర‌భుత్వం హైదరాబాద్, బెంగళూరు నగరాలకు స‌మాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతం(ఐటీఐఆర్‌) మంజూరు చేసింద‌ని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఐటీ రంగంలో నూత‌న కంపెనీలు, డెవ‌ల‌ప‌ర్ల‌ను ప్రోత్స‌హించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం 3 క్లస్టర్లలో అందుకు అవసరమైన భూమిని గుర్తించింద‌న్నారు. 2014 త‌ర్వాత ఐటీఐఆర్ ముందుకు సాగ‌లేద‌ని.., హైద‌రాబాద్‌కు ఐటీఐఆర్ పున‌రుద్ధ‌రించాల‌ని పీఎంను సీఎం కోరారు.

‘‘కోచ్ ఫ్యాక్ట‌రీ.. ఐఐఎం..’’
ప్రతి రాష్ట్రంలో ఒక ఐఐఎం స్థాపించాలని కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయంగా తీసుకున్నా ఇప్పటివరకు తెలంగాణకు ఐఐఎం మంజూరు కాలేద‌ని ప్రధని మోదీ దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. వెంట‌నే హైద‌రాబాద్‌లో ఐఐఎం మంజూరు చేయాలని.., ఇందుకోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో సరిపడా భూమి అందుబాటులో ఉంద‌ని తెలిపారు సీఎం. సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో కాకుండా మ‌రెక్క‌డైనా ఐఐఎం ఏర్పాటు చేస్తామ‌న్నా ప్ర‌త్యామ్నాయంగా భూ కేటాయింపున‌కు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌ని రేవంత్ రెడ్డి వివ‌రించారు. రాష్ట్ర పునర్విభజన సమయంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్ట‌రీకి కేంద్ర ప్ర‌భుత్వం హామీ ఇచ్చిన విష‌యాన్ని ప్రధాని మోదీకి గుర్తు చేశారు. కోచ్ తయారీ కేంద్రానికి బ‌దులు కాజీపేటలో పీరియాడికల్ ఓవరోలింగ్ వర్క్షాప్ ఏర్పాటు చేస్తున్నట్లు 2023 జులైలో రైల్వే మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింద‌ని.. దేశంలోని ఇతర ప్రాంతాలకు కోచ్ ఫ్యాక్టరీలు మంజూరు చేసిన రైల్వే శాఖ కాజీపేటలో మాత్రం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని ప్ర‌క‌టించ‌డం స‌రికాద‌న్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలని మోదీకి విజ్ఞ‌ప్తి చేశారు రేవంత్ రెడ్డి.

అలానే ఇండియా సెమీకండక్టర్ మిషన్‎లో తెలంగాణను చేర్చాల‌ని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్‌లో సెమీకండక్టర్ ఫ్యాబ్స్‌ను నెల‌కొల్పేందుకు ప‌లు కంపెనీలు ఆస‌క్తి క‌న‌ప‌ర్చుతున్న‌ట్లు మోదీకి రేవంత్ రెడ్డి తెలియ‌జేశారు. ఆయా కంపెనీల ప్రతిపాదనలు ప్రస్తుతం ఇండియా సెమీకండక్టర్ మిషన్ సమీక్షలో ఉన్నందున‌.., ఇండియా సెమీకండక్టర్ మిషన్‎లో తెలంగాణ రాష్ట్రానికి చోటు కల్పించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి.

‘‘తెలంగాణ‌కు ఇళ్లు కేటాయించండి..’’
ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ (PMAY) తొలి దశలో తెలంగాణ రాష్ట్రానికి తక్కువ ఇళ్లు మంజూర‌య్యాయ‌ని.. నాడు రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు పీఎంఏవై మార్గదర్శకాలకు అనుగుణంగా లేకపోవడంతో తక్కువ ఇళ్లు మంజూర‌య్యాయ‌ని ప్రధానికి వివ‌రించారు సీఎం రేవంత్ రెడ్డి. 2024-25 నుంచి ప్రారంభమవుతున్న పీఎంఏవై పథకంలో 3 కోట్ల గృహాలను లక్ష్యంగా ఎంచుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింద‌ని.. అందులో తెలంగాణకు 25 లక్షల ఇళ్లు మంజూరు చేయాల‌ని తెలంగాణ సీఎం కోరారు. పీఎంఏవై మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల విధివిధానాలను రూపొందించేందుకు సిద్దంగా ఉంద‌ని సీఎం రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు.

‘‘బీఆర్‌జీఎఫ్ నిధులు రూ. 1800 కోట్లు ఇవ్వండి..’’
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి(BRGF) కింద కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి 2019 వరకు అయిదేళ్ల‌లో తెలంగాణ‌కు రూ. 2,250 కోట్లు కేటాయించింద‌ని.., ఒక్కో ఏడాదికి రూ. 450 కోట్ల చొప్పున ఈ గ్రాంట్ మంజూరు చేశార‌ని.., 2019-20, 2021-22, 2022-23, 2023-24 సంవత్సరాలకు సంబంధించి బీఆర్‌జీఎఫ్ కింద తెలంగాణ‌కు రావ‌ల్సిన రూ. 1,800 కోట్లు విడుదల చేయాలని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.

‘‘రక్షణ శాఖ భూముల బదిలీ చేయండి..’’
రాజధాని హైదరాబాద్‌లో పెరిగిన ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా హైదరాబాద్-కరీంనగర్ రహదారి, హైదరాబాద్-నాగ్‌పూర్ ర‌హ‌దారి (ఎన్‌హెచ్‌-44)పై ఎలివేటెడ్ కారిడార్ల నిర్మించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ముఖ్య‌మంత్రి ప్ర‌ధాన‌మంత్రికి తెలియ‌జేశారు. ఆ రెండు కారిడార్ల నిర్మాణానికి అడ్డంకి లేకుండా మార్గమధ్యంలో రక్షణశాఖ పరిధిలో ఉన్న భూములను రాష్ట్ర ప్ర‌భుత్వానికి బ‌దిలీ చేయాల‌ని కోరారు. ఆ కారిడార్ల‌తో పాటు హైదరాబాద్ న‌గ‌రంలో రహదారుల విస్తరణ, రవాణా, ఇత‌ర‌ మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర రక్షణ శాఖ పరిధిలో 2450 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని ప్ర‌ధాన‌మంత్రి మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఆ భూములకు ప్రత్యామ్నాయంగా రావిరాల ప్రాంతంలో రీసెర్చ్ సెంటర్ ఇమరాత్ (RIC)కి లీజుకు ఇచ్చిన 2,462 ఎకరాల భూములను పూర్తిగా కేంద్రానికి అప్పగించేందుకు త‌మ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంద‌ని తెలిపారు.

‘‘బ‌య్యారంలో ఉక్కు క‌ర్మాగారం..’’
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింద‌ని ప్ర‌ధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి తెలియ‌జేశారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇప్పటికే సాధ్యాసాధ్యాల నివేదికలు సమర్పించాయ‌ని, వెంట‌నే ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పి ప్రక్రియను వేగవంతం చేయాలని రేవంత్ రెడ్డి కోరారు.

‘‘రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం వేగవంతం చేయాలి..’’
భారత్‌మాల పరియోజన మొదటి దశలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్‌) ఉత్తర భాగం (సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు) జాతీయ రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపింద‌ని ప్ర‌ధాన‌మంత్రి దృష్టికి ముఖ్య‌మంత్రి తీసుకెళ్లారు. ఆ ర‌హ‌దారి నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ వ్యయంలో 50 శాతం ఖర్చును ఇవ్వ‌డంతో పాటు రహదారి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్దంగా ఉంద‌ని మోదీకి రేవంత్ రెడ్డి తెలియ‌జేశారు. ఈ ర‌హ‌దారులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను వీలైనంత తొందరగా చేపట్టాలని కోరారు. హైదరాబాద్ చుట్టూ జాతీయ రహదారుల అభివృద్ధికి అత్యంత ఉప‌యోగంగా ఉండే ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని (చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు) వెంట‌నే జాతీయ రహదారిగా గుర్తించి, వెంట‌నే భారత్ మాల పరియోజనలో దాని నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

‘‘13 రాష్ట్ర రాహదారులను జాతీయ ర‌హ‌దారులుగా అప్‎గ్రేడ్ చేయాలి..’’
తెలంగాణలోని ప్రధాన పట్టణాలు, పుణ్య క్షేత్రాలకు పెరిగిన రవాణా అవసరాల దృష్ట్యా 13 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాల‌ని.. జగిత్యాల-పెద్దపల్లి-కాటారం, దిండి-దేవరకొండ-మల్లెపల్లి-నల్గొండ, భువనగిరి- చిట్యాల, చౌటుప్పల్ అమన్‌గల్-షాద్ న‌గ‌ర్‌-సంగారెడ్డి, మరికల్- నారాయణపేట రామసముద్ర, వనపర్తి-కొత్తకోట-గద్వాల మంత్రాలయం, మన్నెగూడ-వికారాబాద్-తాండూరు-జహీరాబాద్-బీదర్, కరీంనగర్-సిరిసిల్ల- కామారెడ్డి-ఎల్లారెడ్డి-పిట్లం, ఎర్రవల్లి ఎక్స్ రోడ్డు-గద్వాల-రాయచూరు, కొత్తపల్లి-హుస్నాబాద్- జనగాం-హైదరాబాద్, సారపాక- ఏటూరునాగారం, దుద్దెడ- కొమురవెల్లి-యాదగిరిగుట్ట రాయగిరి క్రాస్ రోడ్డు, జగ్గయ్యపేట-వైరా-కొత్తగూడెం రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని ప్రధాని మోదీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు.