TG politics: ఏప్రిల్ 5న కరీంనగర్ జిల్లాకు కేసీఆర్

0
17

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటన ఖరారైంది. కరీంనగర్ రూరల్, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో నీరు లేక ఎండిపోయిన పంటలను కేసీఆర్ పరిశీలించనున్నారు. అనంతరం పంట నష్టపోయిన రైతులతో ఆయన మాట్లాడనున్నారు. కేసీఆర్‌ తన పర్యటనలో భాగంగా తొలుత కరీంనగర్‌రూరల్‌ మండలంలోని చెర్లభూత్కుర్‌, చొప్పదండి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు.

అనంతరం వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో పర్యటించి పంటలను పరిశీలిస్తా రు. అక్కడ రైతులతో సమావేశం కానున్నారు. సిరిసిల్లలో మీడియా సమావేశంలో మాట్లాడతారు. నిన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ పర్యటించిన సంగతి తెలిసిందే. గులాబీ బాస్ కరీంనగర్‌ పర్యటన ఖరారు కావడంతో బీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఓటమి చెందిన తరువాత కేసీఆర్‌ ఉమ్మడి జిల్లాకు రావడం ఇది రెండవసారి. మార్చి 12న కరీంనగర్‌ కదనభేరీ పేరిట ఎస్సారార్‌ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే.