TG Politics: దానంకు కాంగ్రెస్ షాక్.. సికింద్రాబాద్ సీటుపై పునరాలోచన!

0
8

సికింద్రాబాద్ సీటును ఎమ్మెల్యే దానం నాగేందర్ క ప్రకటించిన కాంగ్రెస్ నాయకత్వం, ఇప్పుడు పునరాలోచనలో పడినట్టుగా తెలుస్తోంది. దానం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే పోటీకి సిద్ధపడడం ఒక కారణమైతే పార్టీ నిర్వహించిన ఫ్లాష్ సర్వేలో దానం నాగేందర్ గ్రాఫ్ సరిగా లేదని తేలింది. పైగా పార్టీలు మారి పాత గూటికి రెండోసారి తిరిగొచ్చిన దానం నాగేందరు స్థానిక నాయకత్వం, కార్యకర్తల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో అధిష్టానం దానం అభ్యర్థిత్వాన్ని పునఃపరిశీలిస్తున్నట్టు తెలిసింది.

ఈ సీటును మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న నేతకు కేటాయించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్లో చేరిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా గట్టి ప్రయత్నాలు సాగిస్తున్నారు. దానంను మార్చే పక్షంలో బొంతు రామ్మోహన్ ను పరిగణలోకి తీసుకుంటారా లేదంటే.. ముందు నుంచీ పార్టీలో ఉన్న నేతల్లో ఇంకెవరినైనా పరిగణలోకి తీసుకుంటారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

అయితే పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతల్లో ఆడిటర్ బోనుమళ్ల వేణుగోపాల స్వామి ప్రస్తుతం ఢిల్లీలోనే అధిష్టానం పెద్దలతో మంతనాలు సాగిస్తున్నారు. దానం నాగేందరను మార్చే పక్షంలో తనకే సీటు కేటాయించాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. పెండింగులో ఉంచిన కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలతో పాటు సికింద్రాబాద్ స్థానంపై కూడా అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుని తదుపరి జాబితాలో అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది.