Tollywood: నేషనల్ అవార్డు విన్నర్ .. దాసి సుదర్శన్‌ కన్నుమూత

0
17

టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. చిత్రకారుడు, ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ పిట్టంపల్లి సుదర్శన్ కన్నుమూశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని తన స్వగృహంలో గుండెపోటుకు గురయ్యారు. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం పట్టణంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.

సుదర్శన్‌ చిత్రకళ, సాహితీరంగంలో విశేష సేవలందించారు. నాగార్జునసాగర్‌ జూనియర్‌ కళాశాలలో డ్రాయింగ్‌ మాస్టర్‌గా పనిచేసిన ఆయన ఎంతోమంది విద్యార్థులను కళలు, సాహిత్యంవైపు మళ్లించారు.. సాహితివేత్తగానే కాకుండా సినీరంగంలోనూ రాణించారు. ప్రముఖ సినీ దర్శకుడు నర్సింగరావుతో కలిసి పలుచిత్రాల్లో పనిచేశారు.

నర్సింగరావు దర్శకత్వంలో 1988లో విడుదలైన దాసి సినిమాకు ఆయన జాతీయ అవార్డును అందుకున్నారు. జాతీయ అవార్డు జ్యూరీలోనూ సభ్యుడిగా పనిచేశారు. మంగళవారం మిర్యాలగూడలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సుదర్శన్‌ మృతి పట్ల పలువురు కవులు, కళాకారులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.