TS Politics: తెలంగాణ ప్రజలను కష్టాలనుండి గట్టెక్కిస్తా- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

0
25

పాయింట్ బ్లాంక్, వెబ్ డెస్క్: కరీంనగర్ ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించే బాధ్యత తనపై ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఎంపీ బండి సంజయ్ భరోసానిచ్చారు. సోమవారం ఆయన సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించి, మంజూరైన ఎంపీ నిధులతో నిర్మించనున్న పలు మహిళా సమాఖ్య, కుల సంఘ భవనాలకు భూమి పూజ చేశారు. ముందుగా సిరిసిల్ల పట్టణంలోని మున్నూరు కాపు సంఘ కళ్యాణ మండప ప్రహరీ గోడ నిర్మాణానికి.., తర్వాత వీర్నపల్లి మండలం వన్ పల్లి గ్రామంలో రెడ్డి కుల సంఘ భవన నిర్మాణానికి, శాంతినగర్ గ్రామ గిరిజన కుల సంఘ భవన నిర్మాణానికి, అనంతరం ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామ మహిళా సమైక్య సంఘ భవన నిర్మాణానికి, తదనంతరం తంగేళ్లపల్లి మండల కేంద్రంలో గౌడ కుల సంఘ భవన నిర్మాణానికి ఆయా సంఘాల కుల పెద్దలు, ప్రజా ప్రతినిధులు, బీజేపీ నాయకులతో కలిసి భూమి పూజ చేశారు.

అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు మానుకొని అభివృద్ధిపై దృష్టి సాధిద్దామని పిలుపునిచ్చారు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందుతేనే రాష్ట్రాలు, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతేనే దేశం అభివృద్ధి చెందుతుందని, దానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందించే బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు బండి సంజయ్.