CBN: చంద్రబాబు కాన్వాయ్ వెంట పరిగెత్తిన మహిళ.. కారు ఆపి పలకరించిన బాబు

0
16

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: విజయవాడలోని ఎ-కన్వెన్షన్ లో కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు దారి పొడవునా స్వాగతం పలికారు. సమావేశం అనంతరం ఉండవల్లికి తిరుగు పయనమైన చంద్రబాబుని చూసేందుకు ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. అది గమనించిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్‎‎ను ఆపి ఆమెను దగ్గరకు పిలిచి మాట్లాడారు. సెక్యూరిటీని వారించి ఆమె వివరాలు తెలుసుకున్నారు. తనది మదనపల్లి అని.., తన పేరు నందిని అని ఆమె తెలిపారు. టీడీపీ గెలుపు కోసం రేయింబవళ్లు శ్రమించానని ఆమె తెలపడంతో బాబు థాంక్స్ చెప్పారు. చంద్రబాబు గారిపై అభిమానంతో 104 డిగ్రీల జ్వరం ఉన్నప్పటికీ చూడడానికి వచ్చానని ఆమె చెప్పడంతో ఆరోగ్యం చూసుకోవాలని.., ఆసుపత్రికి వెళ్లాలని చంద్రబాబు సూచించారు. “మా కష్టం ఫలించి.. మా కోరిక మేరకు మీరు సీఎం అయ్యారు సార్! ఒక్కసారి మీ కాళ్లు మొక్కుతాను” అంటూ ఆ మహిళ ముందుకు రాగా చంద్రబాబు సున్నితంగా వారించి, ఆప్యాయంగా ఆమెతో ఫోటో దిగారు.