YSRCP : వైసీపీకి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా

0
15

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ అధికార వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను శుక్రవారం సీఎం జగన్‌కు పంపించారు. డొక్కా వరప్రసాద్ వైసీపీ నుంచి తాటికొండ టికెట్ ఆశించారు. అధిష్టానం ఆయనకు షాక్ ఇవ్వడంతో కొన్ని రోజులుగా అసంతృప్తిలో ఉన్నారు. కాగా, తాటికొండ టికెట్‌ను సీఎం జగన్ మేకతోటి సుచరితకు కేటాయించారు. అయితే 2004లో కాంగ్రెస్‌లో చేరిన ఆయన తాడికండ ఎమ్మెల్యేగా వరప్రసాద్ విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. మంత్రిగా కూడా సేవలు అందించారు. ఆయన విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత అనూహ్యంగా మూడు రాజధానుల బిల్లు సమయంలో ఆయన వైసీపీలో చేరారు. అప్పుడే టీడీపీ తరపు ఎమ్మెల్సీగా రాజీనామా చేసి వైసీపీ నుంచి అదే స్థానంలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.